చండీగఢ్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మండిపడ్డారు. దేశంలో ఇంధన ధరల ఆకాశాన్ని అంటుతున్నా వాటిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్తో పోల్చితే సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. గత కొన్ని వారాలుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు జీవితకాల గరిష్టానికి చేరుకుని సరికొత్త రికార్డుని నెలకొల్పయాని ఎద్దేవా చేశారు.
ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్న కేంద్రం మాత్రం ధరలను తగ్గించే ఆలోచన చేపట్టకపోవడం బాధకరమని అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలపై అధిక పన్నులు విధించి ఇంధన కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. క్రూడాయిల్కు పన్ను మినహాయింపు అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందిచడం లేదని ప్రశ్నించారు.