'గాంధీ, నెహ్రూ, అంబేద్కర్‌లు ఎన్నారైలు'

22 Sep, 2017 16:10 IST|Sakshi

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భారత స్థాతంత్ర్య ప్రముఖ ఉద్యమకారులను ఎన్నారైలు అని సంబోధించారు. అలాగే, స్వాతంత్ర్య ఉద్యమాన్ని కూడా ఎన్నారై ఉద్యమం అని అభివర్ణించారు. ఎన్నారై ఉద్యమంలో భాగంగానే తమ కాంగ్రెస్‌ పార్టీ పుట్టిందని చెప్పారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ విదేశాల్లోని కాంగ్రెస్‌ మద్దతుదారులతో భేటీ అవుతూ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా గురువారం న్యూయార్క్‌లో దాదాపు 2000 మంది కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన..

'నాడు కాంగ్రెస్‌ అసలైన ఉద్యమం ఎన్నారై ఉద్యమం. మహాత్మాగాంధీ ఒక ఎన్నారై. నెహ్రూ ఇంగ్లాండ్‌ నుంచి భారత్‌కు వచ్చారు. అంబేద్కర్‌, ఆజాద్‌, పటేల్‌ వీరంతా కూడా ఎన్నారైలే' అని ప్రకటించి గందరగోళంలో పడేశారు. అయితే, తన వ్యాఖ్యలను సమర్థించుకునే దిశగా ప్రయత్నించిన రాహుల్‌.. 'నేను పేర్కొన్న వ్యక్తుల్లో ప్రతి ఒక్కరు ప్రపంచంలోని ఏదో ఒక మూలకు వెళ్లి అక్కడి పరిస్థితులు అవగాహన చేసుకొని అక్కడి ఆలోచనలు ధృక్పథాలను భారత్‌ను మార్చేందుకు ఉపయోగించారు. ఇలాంటి ఎన్నారైలు వేలమంది ఉన్నారు. గుర్తింపులోకి రానివారు ఇంకెందరో ఉన్నారు. ఉదాహరణకు భారత్‌లో శ్వేత విప్లవాన్ని తీసుకొచ్చిన వర్గీస్‌ కురియన్‌ కూడా ఒక ఎన్నారైనే. ఆయన అమెరికా నుంచి భారత్‌కు వచ్చారు.. మార్పు తెచ్చారు. ఇలా మార్పులు తెస్తున్న ఎన్నారైలు ఎంతోమంది ఉన్నారు. వారందరిని గుర్తించాల్సి ఉంది' అని రాహుల్‌ అన్నారు.

మరిన్ని వార్తలు