కోర్టులో గ్యాంగ్‌వార్‌.. గుండెలోకి బుల్లెట్లు

30 Apr, 2017 09:00 IST|Sakshi
కోర్టులో గ్యాంగ్‌వార్‌.. గుండెలోకి బుల్లెట్లు

న్యూఢిల్లీ: న్యాయస్థానంలోనే గ్యాంగ్‌ వార్‌ జరిగింది. కోర్టు ప్రాంగణంలోనే దారుణం చోటుచేసుకుంది. కోర్టు హాజరుకు తీసుకొస్తున్న విచారణ ఖైదీపై ఓ కిరాయి హంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలోని రోహిణీ కోర్టులో శనివారం ఉదయం జరిగింది. రాజేశ్‌ దుర్ముత్‌ అనే విచారణలో ఉన్న ఖైదీని హర్యానా పోలీసులు కోర్టుకు తీసుకొస్తుండగా అదే సమయంలో కోర్టు వద్ద ఉన్న పెద్ద సమూహంలో నుంచి దూసుకొచ్చిన మోహిత్‌ అనే వ్యక్తి నాటు తుపాకీ తీసుకొని కాల్పులు జరిపాడు.

దీంతో బుల్లెట్లు అతడి భుజంలోకి, గుండెలోకి దూసుకెళ్లాయి. దీంతో అతడు చనిపోయాడు. కాల్పులు జరిపిన కిరాయి హంతకుడు అంతటితో ఆగకుండా మరో తుపాకీ తీసి పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ తుపాకీ పేలలేదు. దీంతో అతడు పారిపోయేందుకు ప్రయత్నించినా చివరికి దొరికిపోయాడు. బాధితుడు దుర్ముత్‌ నీతు దాబోడియా గ్యాంగ్‌లో సభ్యుడు. ఇతడిపై 16 దొంగతనం, హత్యలు, దోచుకోవడంలాంటి కేసులు ఉన్నాయి. రెండు రోజుల ముందు నుంచే మోహిత్‌ ప్లాన్‌ చేసుకొని పోలీసుల వాహనాన్ని అనుసరించి ఈ హత్య చేసినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు