గ్యాంగ్‌స్టర్‌ ఇల్లు కూల్చివేత, సరళాదేవీ విచారం

5 Jul, 2020 11:41 IST|Sakshi

లక్నో/కాన్పూర్‌: కరుడుగట్టిన నేరస్తుడు వికాస్‌ దుబేను ఎన్‌కౌంటర్‌ చేయాలని కోరిన అతని తల్లి సరళాదేవీ.. పోలీసులు తమ ఇంటిని కూల్చివేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆ ఇంటిని చాలా కాలం క్రితం తాము కష్టపడి నిర్మించుకున్నామని శనివారం మీడియాతో అన్నారు. కాగా, గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై అతడి అనుచరులు కాల్పులకు తెగబడి తప్పించుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. సాధారణ పౌరుడితో సహా ఏడుగురు పోలీసులు గాయపడ్డారు.

ఇక నేరగాడు దుబే, అతని గ్యాంగ్‌ను పట్టుకునేందుకు పోలీస్‌ శాఖ ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. 25 పోలీసు బృందాలు యూపీతోపాటు ఇతర రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదిలావుంటే.. వికాస్ దుబే ఆచూకీ తెలిపిన వారికి రూ.50వేల నగదు ఇస్తామని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ ప్రకటించారు. దాంతోపాటు గ్యాంగ్‌స్టర్‌ దుబేకు సహకరించినట్లు ఆరోపణలు రావడంతో చౌబేపూర్‌ పోలీస్‌ ఠాణా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌(ఎస్‌హెచ్‌వో)ను అధికారులు సస్పెండ్‌ చేశారు. దుబే  స్వగ్రామం భిక్రూలోని అతడి సొంతింటిని సాయుధ పోలీసులు బుల్‌డోజర్లతో శనివారం నేలమట్టం చేయించారు. ఆవరణలోని ఖరీదైన కార్లను ధ్వంసం చేయించారు. 
(వికాస్‌ దూబే తల్లి సంచలన వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు