కేజ్రీవాల్ తీరును తప్పుపట్టిన మాజీ క్రికెటర్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాక్డౌన్ 4.0 కు భారీ సడలింపులు ప్రకటించడాన్ని బీజేపీ నేత, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తప్పుపట్టారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ అన్నీ ఒకేసారి తెరిస్తే అది డెత్ వారెంట్లా మారుతుందని హెచ్చరించారు. ఒకేసారి అన్నింటినీ తెరవడం ఢిల్లీ వాసులకు మృత్యుగంట మోగించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక తప్పుడు నిర్ణయంతో తీవ్ర అనర్ధం వాటిల్లుతుందని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఢిల్లీలో రేపటి నుంచి బస్లు, కార్లు సహా ప్రజా రవాణాను అనుమతిస్తామని, అన్ని షాపులు, కార్యాలయాలు తెరుచుకుంటాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో సాదారణ కార్యకలాపాలు సాగుతాయని, ఎక్కువ కాలం లాక్డౌన్ కొనసాగించలేమని కేజ్రీవాల్ పేర్కొన్నారు.