‘ఇలాంటి ప్రధాని ఉండటం మనకు గర్వకారణం’

17 Sep, 2019 12:17 IST|Sakshi

న్యూఢిల్లీ : ‘పార్లమెంటు, తన తల్లికి ప్రధాని మోదీ ఒకే విధమైన గౌరవం ఇస్తారు. తల్లి ముందు, పార్లమెంటు గుమ్మం ముందు మాత్రమే ఆయన శిరసు వంచుతారు. ఇలాంటి ప్రధాని ఉండటం మనకు గర్వకారణం. నరేంద్ర మోదీ జీ దేశానికి లభించిన గొప్ప వ్యక్తి. దేశానికి గౌరవం కూడా’ అంటూ మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేసిన గంభీర్‌...ప్రధానికి సంబంధించిన ఫొటోలను తన అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో కలకాలం వర్థిల్లాలంటూ సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా నరేంద్ర దామోదర్ దాస్‌ మోదీ గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950, సెప్టెంబరు 17న జన్మించారు. టీ అమ్ముకునే స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎదిగి అందరి అభిమానం చూరగొన్నారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా గుజరాత్‌కు చేరుకున్న మోదీ..తన మాతృమూర్తి హీరాబెన్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ కార్యక్రమాల నిర్వహణతీరు, ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు. అదే విధంగా ప్రధాని మోదీ జన్మదినాన్ని సేవా సప్తా పేరిట నిర్వహిస్తున్న బీజేపీ..దేశంలోని పలు ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. ఇక భారత క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న గౌతం గంభీర్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. దేశ రాజధానిలోని ఈస్ట్‌ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంభీర్‌ ఘన విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు.(చదవండి: కాంగ్రెస్‌ వాలంటీర్‌గా పనిచేసిన మోదీ! )

మరిన్ని వార్తలు