గౌతమ్‌ నవ్‌లఖాకు విముక్తి

2 Oct, 2018 04:10 IST|Sakshi
గౌతమ్‌ నవ్‌లఖా

న్యూఢిల్లీ: గృహ నిర్బంధంలో ఉన్న హక్కుల కార్యకర్త గౌతమ్‌ నవ్‌లఖాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. భీమా–కోరెగావ్‌ హింసకు కారణమంటూ గౌతమ్‌ నవ్‌లఖా సహా అరెస్టయిన ఐదుగురు హక్కుల కార్యకర్తలు ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటు మేరకు ఆయన తరఫున ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ ఎస్‌.మురళీధర్, జస్టిస్‌ వినోద్‌ గోయెల్‌ల ధర్మాసనం విచారించింది.

నవ్‌లఖాను ట్రాన్సిట్‌ రిమాండ్‌కు ఆదేశిస్తూ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఆగస్టు 29న వెలువరించిన ఉత్తర్వులను కోర్టు కొట్టి వేసింది. ‘రాజ్యాంగంలోని ప్రాథమిక నియమాలకు వ్యతిరేకంగా, నేర శిక్షా స్మృతికి వ్యతిరేకంగా ఆ ఉత్తర్వులు ఉన్నాయి. చట్ట ప్రకారం నవ్‌లఖా 24 గంటల గృహ నిర్బంధం పూర్తయింది. ఫలితంగా ఆయన గృహ నిర్బంధం ముగిసినట్లే. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలకు ఈ ఉత్తర్వులు అడ్డంకి కాబోవు’ అని కోర్టు స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు