పీవోకే స్వాధీనం చేసుకునేందుకు సిద్ధం: రావత్‌

12 Sep, 2019 16:07 IST|Sakshi

శ్రీనగర్‌ : పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సైనిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ గురువారం స్పష్టం చేశారు. పీవోకేను తిరిగి భారత్‌లో అంతర్భాగం చేసేందుకు ప్రభుత్వం ఆదేశిస్తే సైనిక చర్యకు తాము సిద్ధమని పేర్కొన్నారు. పాకిస్తాన్‌ చేతుల నుంచి పీవోకేను తిరిగి సాధించడమే భారత తదుపరి అజెండా అని బిపిన్‌ రావత్‌ తేల్చిచెప్పారు. ఈ దిశగా నిర్ణయం తీసుకోవాల్సింది భారత ప్రభుత్వమేనని పేర్కొన్నారు. పీఓకే స్వాధీనం దిశగా కేంద్రం అనుమతి కోసం వేచిచూస్తున్నామని, ఆదేశాలు రాగానే వెంటనే ఆపరేషన్‌ ప్రారంభిస్తామని చెప్పారు.

ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా దేశంలోని వ్యవస్థలు పనిచేస్తాయని, ఇందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కాగా పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవడమే తదుపరి భారత్‌ అజెండా అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. 1994లో పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదించిన తీర్మానంలోనూ ఈ విషయం పొందుపరిచారని ఆయన ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు