లాక్‌డౌన్‌ : 55 రోజుల పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే

12 May, 2020 14:34 IST|Sakshi

ఢిల్లీ : కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో జర్మన్‌ జాతీయుడు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే 55 రోజుల పాటు ఉండిపోవాల్సి వచ్చింది. కాగా మంగళవారం ఉదయం ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అన్ని పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్‌ రావడంతో జర్మనీకి చెందిన కెఎల్‌ఎమ్‌ విమానంలో ఆ వ్యక్తిని ఆమ్‌స్టర్‌డామ్‌కు పంపించారు. వివరాలు.. జర్మనీకి చెందిన ఎడ్గార్డ్ జీబాట్ దేశంలో లాక్‌డౌన్‌ విధించకముందు మార్చి 18న వియత్నాం నుంచి ఢిల్లీకి వచ్చాడు. ఇంతలో కరోనా మహమ్మారి విజృంభించడంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. దీంతో చేసేదేంలేక జీబాట్‌ అధికారులను ఆశ్రయించాడు. వారు విమానాశ్రయంలోనే విదేశీయుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వసతిలో జీబాట్‌ను ఉంచారు.ముందస్తుగా అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ అని తేలింది.
(కరోనా : ఎయిరిండియా ఉద్యోగికి పాజిటివ్‌)

అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో విమాన సేవలు నిలిచిపోవడంతో జీబాట్‌ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. జీబాట్‌కు అన్ని వసతులు కల్పించిన అధికారులు అతనిపై విచారణ చేపట్టారు. విచారణ సమయంలో జీబాట్‌ మాట్లాడుతూ.. తాను వియత్నాం నుంచి మార్చి 18న వియత్జెట్ విమానం ద్వారా ఢిల్లీకి వచ్చానని పేర్కొన్నాడు. ఢిల్లీ నుంచి టర్కీలోని ఇస్తాంబుల్‌కు అనుసంధానంగా విమానంలో బయలుదేరాల్సిన సమయంలో ఇండియాలో లాక్‌డౌన్‌ విధించారు. లాక్‌డౌన్‌ కారణంగా వాణిజ్య, పౌర విమానాయాన సేవలు నిలిచిపోవడంతో ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని తెలిపాడు. దాదాపు 55 రోజుల పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే గడపాల్సి వచ్చిందని, అయితే అధికారులు తనకు అన్ని వసతులు కల్పించారని జీబాట్‌ పేర్కొన్నాడు.
(లాక్‌డౌన్‌: కేజ్రీవాల్‌ వినూత్న నిర్ణయం)

మరిన్ని వార్తలు