నిర్భయ తరహాలో.. మరో దారుణం

30 Jun, 2015 15:22 IST|Sakshi
నిర్భయ తరహాలో.. మరో దారుణం

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు శవాల్లా చెట్టుకు వేలాడిన దృశ్యం ఇంకా కళ్ల ముందు చెదిరిపోక ముందే బదయూ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. 14 ఏళ్ళ బాలికపై అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేసి, బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.   పొద్దున్నే బిస్కట్లు, స్వీట్లు తెచ్చుకుందామని బయటకు వచ్చిన అమ్మాయిని ముగ్గురు వ్యక్తులు అపహరించుకుపోయారు. బలవంతంగా ఏదో తాగించి స్పృహ కోల్పోయిన తర్వాత సమీపంలోని   నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. దారుణంగా హింసించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఎట్టకేలకు మూడు రోజుల నరకం తర్వాత బంధువుల సాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

''ఎవరో పిలుస్తున్నారని పక్కింటబ్బాయి చెబితే వెళ్లా. అక్కడ ఇంకో ఇద్దరు ఉన్నారు. అందరూ కలిసి బలవంతంగా ఏదో తాగించి,  బంధించి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు''  అని బాధిత బాలిక పోలీసులకిచ్చిన స్టేట్మెంట్లో తెలిపింది.

ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందనే విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు. దీంతోపాటు  మరో దిగ్భ్రాంతికర విషయాన్ని కూడా డాక్టర్లు వెల్లడించారు. నిర్భయ గ్యాంగ్ రేప్ తరహాలో  అగ్గిపెట్టె, ప్లాస్టిక్,  గుడ్డముక్కలు, చిన్న చెక్కముక్కను బాలిక ప్రయివేట్ పార్ట్ పరీక్షలో కనుగొన్నామని తెలిపారు.  కేసు నమోదుచేసిన పోలీసులు ముగ్గురు నిందితులలో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు