షాకింగ్ ఘటన... పోలీసుల మైండ్ బ్లాంక్!

12 May, 2016 11:20 IST|Sakshi
షాకింగ్ ఘటన... పోలీసుల మైండ్ బ్లాంక్!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ చిన్నారి కిరాతకానికి ఒడిగట్టింది. లూటీ చేయడంలో భాగంగా ఓ వృద్ధురాలిని బాలిక చితకబాదిన ఘటన న్యూఢిల్లీలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై ముక్కుమీద వేలేసుకుంటున్నారట. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ బాలిక(11) నిన్న సాయంత్రం తల్లి పనిచేసే చోటుకు బయలుదేరింది. రాజౌరి గార్డెన్ ప్రాంతానికి రాగానే ఏం జరిగిందో తెలీదు కానీ, ఆ దారిలో వెళ్తోన్న 71 ఏళ్ల వృద్ధురాలు మదాన్ పై దాడికి పాల్పడింది. మొదటగా బ్లాక్ పెప్పర్ స్ప్రేని పెద్దావిడ కళ్లల్లో కొట్టింది. ఆ వెంటనే పూలకుండీతో ఆమెపై దాడికి దిగి ఆమెను చితకబాదింది. దీంతో దెబ్బలకు తట్టుకోలేక ఆ వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది.

మదాన్ అరుపులు విన్న కొందరు వెంటనే అక్కడికి వచ్చి ఆమెను కాపాడి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకోగానే ఆ బాలికను స్థానికులు వారికి అప్పగించారు. వారు ఆ బాలికను చిన్నారుల కేర్ హౌస్ కు తరలించారు. బాలిక ఎందుకు ఈ దారుణానికి పాల్పడిందో స్పష్టతరాలేదని చెప్పారు. వృద్ధురాలి వద్ద ఉన్న విలువైన వస్తువులు చోరీ చేయడానికి ఉద్దేశపూర్వకంగానే బాలిక ఈ పని చేసి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. పెప్పర్ స్ప్రేతో సంచరించాల్సిన అవసరం ఏంటన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వృద్ధురాలిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు