ఖాతాదారుల వివరాలివ్వండి

30 Jun, 2014 00:54 IST|Sakshi

స్విస్‌కు కేంద్రం మరోసారి లేఖ

జ్యురిచ్/న్యూఢిల్లీ: నల్లధనంపై పోరు ప్రారంభించిన కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు  దూకుడు పెంచింది. స్విస్ బ్యాంకుల్లో రహస్య ఖాతాలు నిర్వహిస్తున్న భారతీయుల జాబితాను పేర్లతో సహా పూర్తి వివరాలను తమకు అందజేయాలని  మరోసారి అభ్యర్థించింది. ఈ మేరకు ఆర్థిక  శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్విస్ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఈ విషయంపై గతవారం మొదట్లోనే స్పందించిన స్విట్జర్లాండ్.. తమ బ్యాంకుల్లో నగదు దాచిన భారతీయుల జాబితాను సిద్ధం చేస్తున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో స్విస్‌లోని వివిధ బ్యాంకుల్లో నగదు దాచినవారి వివరాలపై అక్కడి అధికారులు విచారణ ప్రారంభించారు. భారత్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి సహకరించే దిశగా అడుగులు వేస్తున్నామని, నల్లధనంపై ఏర్పాటైన సిట్‌కు సాధ్యమైనంత వరకు సహకారం అందిస్తామని తెలిపారు.

నగదుగా కాకుండా బంగారం, వజ్రాలు, బిట్‌కాయిన్స్ ముసుగులో జరుగుతున్న నల్లధనం మార్పిడిపైనా సహకరిస్తామన్నారు. స్విట్జర్లాండ్ నుంచి పసిడి ఎగుమతులకు భారత్ కేంద్రంగా ఉందని, ఈ ఏడాది ఇప్పటిదాకా స్విస్ నుంచి భారత్‌కు రూ. 40వేల కోట్ల బంగారం ఎగుమతైందన్నారు. ఈ విషయంలో భార త్‌కు సమాచారమిస్తున్నామని స్విస్ అంతర్జాతీయ ఆర్థిక విషయాల ప్రతినిధి మారియో టోర్ చెప్పారు. కాగా పన్ను ఎగవేతదారులు, ఆర్థికనేరాలపై నడుస్తున్న కేసుల వివరాలను తమకివ్వాలనినల్లధనం వెలికితీతపై జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలో ఏర్పాటైన సిట్.. రెవెన్యూ, ఈడీ సహా 11 శాఖలను కోరింది.
 

మరిన్ని వార్తలు