ఆమెపై పెరిగిన వివక్ష

6 Jul, 2020 02:18 IST|Sakshi

కోవిడ్‌ మహమ్మారి సంక్షోభంతో అంతరాల్లో వృద్ధి

ఉపాధి, వేతనాల్లో మగవారితో పోల్చితే పెరిగిన గ్యాప్‌

పురుషుల కంటే 35 శాతం తక్కువగా ఆదాయాలు..

జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌లో 112వ స్థానంలో భారత్‌

సాక్షి,హైదరాబాద్‌: మహిళల పట్ల వివక్ష మరింత పెరిగింది. కోవిడ్‌ మహమ్మారి అతి వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరు ణంలో ఇది ఇంకా ఎక్కువవుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తితో ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా అతివలపై ఆర్థికపరమైన ప్రభావాలు ఇంకా తీవ్రమవుతున్నాయి. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో స్త్రీ–పురుషుల మధ్య అంతరాలు, ఆర్థికపరమైన అంశాలు, సంపాదించే జీతాలు, వేతనాల్లో తేడా లు అధికంగా ఉండటంతో మహిళలు మునపటి కన్నా ఎక్కువ వివక్షను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగం–ఉపాధి, వేతనాలు, విద్య తదితర రంగాల్లో ఇప్పటికే వివక్షను ఎదుర్కొంటున్న స్త్రీలు.. కోవిడ్‌ కారణంగా తలెత్తిన ప్రత్యేక పరిస్థితుల్లో ఆర్థిక, తదితర అంశాల్లో ఎక్కువ సమస్యల బారిన పడుతున్నారు. మగవారితో పోల్చితే జెండర్‌పరంగా ఉపాధి రంగంలో మహిళలు అధిక వివక్షకు గురవుతున్నట్టు వివిధ పరిశీలనల్లో వెల్లడైంది. (కరోనాతో కార్పొరేట్‌ దందా)

లేబర్‌ ఫోర్స్‌లో 25 శాతం కంటే తక్కువే..:
దేశంలోని మొత్తం ‘లేబర్‌ ఫోర్స్‌’లో స్త్రీలు 25% కంటే తక్కువగానే ఉన్నారంటే ఇక్కడున్న వాస్తవ పరిస్థితులు అవగతమవుతున్నాయి. అంతేకాకుండా పురుషులతో పోల్చితే మహి ళలు సగటున 35% మేర తక్కువ వేతనాలు లేదా జీతాల రూపంలో తక్కువ ఆదాయం పొందుతున్నారు. అదే ప్రపంచస్థాయి సగటు అంతరం మగవారితో పోల్చితే మాత్రం 16 శాతంగానే ఉంది, భారత్‌ జనాభాలో 49 శాతమున్న స్త్రీలు, దేశ ఆర్థికపరమైన ఉత్పాదకతలో మాత్రం వారి వంతు కాంట్రిబ్యూషన్‌ 18 శాతమేనని తేలింది. దేశంలో గత 3, 4 నెలల్లో మహమ్మారి వ్యాప్తి కాలంలోనే మహిళలు కోల్పోయిన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కారణంగా యూఎస్‌ 216 బిలియన్‌ డాలర్ల మేర ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఆక్స్‌ఫామ్‌ ఇండియా ఇటీవల వెల్లడించింది. ఇప్పటికే పురుషులతో పోల్చితే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారిపై మరింత తీవ్ర ప్రభావం చూపుతోంది. (ఒక్కరోజు ‘కరోనా’ బిల్లు రూ. 1,50,000)

దేశంలో మరింత తీవ్రం
కోవిడ్‌ మహమ్మారి కారణంగా వివిధ రూపాల్లో మహిళలపై పడుతున్న ప్రభావం భారత్‌లోని సామాజిక అసమానతలు, వివక్ష వల్ల మరింత తీవ్రంగా ఉంటోంది. వైరస్‌ వ్యాప్తి కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో ఇళ్లలో బరువు, బాధ్యతలు, పనులు మరింత పెరగటంతో వారిలో అధిక శాతం బయట పనులకు దూరమవుతున్నారు. దేశంలో ప్రతీ 15 నిముషాలకో అమ్మాయి అత్యాచారానికి గురవుతోంది. దీంతో పాటు లాక్‌డౌన్‌ కాలం నుంచి మహిళల నుంచి గృహహింస ఫిర్యాదులు కూడా రెండింతలు పెరిగాయి. ప్రస్తుతం వేగంగా మారుతున్న సాంకేతికత నేపథ్యంలో దేశంలో 29 శాతం మహిళలు మాత్రమే ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నట్టు వెల్లడైంది.

జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌లో మనది 112వ స్థానం..
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ‘గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌–2020’లోని మొత్తం 153 ప్రపంచ దేశాల్లో భారత్‌ 112వ స్థానంలో నిలిచింది. మగవారితో సమానంగా అవకాశాల కల్పనలో వివిధ దేశాలతో పోల్చితే మన దేశం ఆ స్థానంలో నిలుస్తోంది. పురుషులకు వైద్య, ఆరోగ్య, విద్య వంటి రంగాల్లో మహిళలకు తక్కువ ప్రాధాన్యత లభిస్తోంది.!

 

మరిన్ని వార్తలు