మళ్లీ ఆస్పత్రిలో చేరిన పారికర్‌

16 Sep, 2018 03:37 IST|Sakshi

గోవా సీఎం మార్పుపై ఊహాగానాలు

న్యూఢిల్లీ: దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ (62) శనివారం మరోసారి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. దీంతో బీజేపీ నాయకత్వం ఇతర మార్గాల అన్వేషణలో పడింది. ప్యాంక్రియాటిక్‌ వ్యాధితో బాధపడుతున్న పారికర్‌ వారం పాటు అమెరికాలో చికిత్స పొంది ఈనెల మొదటి వారంలోనే ఆయన తిరిగి వచ్చారు. కొన్ని రోజులకే మరోసారి గోవాలోని కండోలిమ్‌ ఆస్పత్రిలో చేరారు. అంతకు ముందు ఈ ఏడాది ప్రారంభంలో 3 నెలల పాటు పారికర్‌ అమెరికాలో సుదీర్ఘ చికిత్స పొందిన విషయం తెలిసిందే. తరచూ ఆయన అనారోగ్యానికి గురికావడం, తదనంతర పరిణామాలపై చర్చించేందుకు ఇద్దరు సభ్యుల బీజేపీ కేంద్ర బృందం సోమవారం గోవా వెళ్లనుంది. పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యామ్నాయాల మార్గాల అన్వేషణలో ఉందని సమాచారం. నాయకత్వ మార్పిడికి సంబంధించి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పారికర్‌తో చర్చించినట్లు కూడా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు