వేదాలు చదవండి.. దిగుబడి పెంచుకోండి

24 Nov, 2018 06:09 IST|Sakshi

పణజీ: పంట పొలాల్లో 20 రోజుల పాటు.. రోజుకు కనీసం 20 నిమిషాల చొప్పున వేదాలను వల్లె వస్తే పంటల దిగుబడి, నాణ్యత పెరుగుతుందని, ఈ ‘కాస్మిక్‌ ఫార్మింగ్‌’ను పాటించాలని రైతులకు గోవా సర్కారు సూచించింది. తద్వారా రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలను పండించవచ్చంది. ఇందుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం శివ యోగా ఫౌండేషన్, బ్రహ్మకుమారీస్‌ తదితర సంస్థలను సంప్రదిస్తోందని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. వ్యవసాయ మంత్రి విజయ్‌ సర్దేశాయి, వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ నెల్సన్‌ ఫిజీరెడొలు ఇటీవలే గురుగ్రామ్‌లోని శివ యోగా ఫౌండేషన్‌కు చెందిన గురు శివానంద్‌తో ప్రత్యేకంగా భేటీ అయి కాస్మిక్‌ ఫార్మింగ్‌ ఉపయోగాలపై చర్చించారని ఆయన వెల్లడించారు. పంట పొలాల్లో వేద పఠనం వల్ల విశ్వంలోని శక్తి ఆ భూమిలోకి వచ్చి పంటల దిగుబడి, నాణ్యత పెరుగుతుందని నెల్సన్‌ ఫిజీరెడొ తెలిపారు.

మరిన్ని వార్తలు