దేవుడు ఖచ్చితంగా సిగ్గుపడతాడు : జడ్జి

18 Dec, 2019 18:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ కేసులో విచారణ సందర్భంగా బుధవారం పాటియాలా కోర్టులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. దోషుల ఉరిశిక్షపై విచారణను కోర్టు జనవరి 7కి వాయిదా వేసిన సందర్భంగా నిర్భయ తల్లి ఆశాదేవి మాట్లాడుతూ.. ఏడేళ్ల నుంచి ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నామని, ఉరి శిక్ష త్వరగా అమలయ్యేలా చూడాలని జడ్జికి మొరపెట్టుకుంది. దీనికి స్పందించిన జడ్జి ‘మీకు జరిగిన అన్యాయం పట్ల మాకు సానుభూతి ఉంది. కానీ నిందితులకు కూడా కొన్ని హక్కులుంటాయి. చట్ట ప్రకారం మేం అలా నడుచుకోకతప్పద’ని వ్యాఖ్యానించారు.

అంతేకాక ‘దేవుడు ఉండి ఉంటే రెండు విషయాలలో ఖచ్చితంగా సిగ్గుపడతాడు. ఒకటి నిర్భయ ఘటన జరిగినందుకు, మరొకటి ఆ ఆరుగురు దోషులను పుట్టించినందుకు’ అని చెప్పారు. అనంతరం కోర్టు బయటికొచ్చిన నిర్భయ తల్లి మాట్లాడుతూ.. ఎక్కడ చూసినా దోషులకున్న హక్కుల గురించే మాట్లాడుతున్నారు. బాధితులమైన మాకు ఎలాంటి హక్కులు లేవా? అని ఆవేదనతో ప్రశ్నించారు. నిర్భయ తండ్రి బద్రీనాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఏడేళ్లు అతి భారంగా గడిచాయి. కోర్టు ఉరిశిక్ష విధించినా ఎప్పుడు అమలు చేస్తారో తెలియట్లేదు. ఇప్పుడు ఒక్కో సెకను గడవడం కూడా చాలా కష్టంగా ఉందని బరువెక్కిన హృదయంతో వ్యాఖ్యానించారు. 
చదవండి : నిర్భయ దోషుల ఉరిశిక్ష విచారణ వాయిదా

>
మరిన్ని వార్తలు