30 కిలోల బంగారాన్ని మింగేశారు

9 Oct, 2017 19:01 IST|Sakshi

సాక్షి, చెన్నై: ‘మీ ఇల్లు బంగారం గానూ’  అంటూ ఆశ్చర్యపోవడం అనాదిగా వస్తోంది. అయితే మధురై విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు 20 మంది ప్రయాణికులకు స్కానింగ్‌ తీసి ‘ మీ కడుపు బంగారం గానూ’ అంటూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌ నుంచి ఆదివారం రాత్రి మధురై విమానాశ్రయానికి వచ్చే విమానంలో భారీ ఎత్తున బంగారం అక్రమ రవాణా సాగుతున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్, కస్టమ్స్‌ అధికారులకు సమాచారం వచ్చింది. ఆ విమానం నుంచి దిగిన 60 మంది ప్రయాణికులను తనిఖీ చేసి స్కానింగ్‌లు సైతం తీయగా వీరిలోని 20 మంది కడుపులో బంగారాన్ని దాచిపెట్టుకుని ఉన్నట్లు గుర్తించారు. చిన్నపాటి పాలిథిన్‌ కవర్లో 30 కిలోల బరువులున్న బంగారు బిస్కెట్లను పెట్టి మింగేసినట్లు అధికారులు తెలుసుకున్నారు. ఈ 20 మంది ప్రయాణికులను సోమవారం ఉదయం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ఎనిమా ఇచ్చి బంగారు బిస్కెట్లను బైటకు తీయించారు. వీరిలో కొందరు మహిళలు కూడా ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. మధురై విమానాశ్రయంలో 30 కిలోల బంగారు పట్టుబడటం ఇదే ప్రధమనని ఆయన అన్నారు.
 

మరిన్ని వార్తలు