కన్వార్‌ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తున్న ‘గోల్డెన్‌ బాబా’

30 Jul, 2019 15:54 IST|Sakshi

లక్నో: సుధీర్‌ మక్కర్‌ అంటే పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ ‘గోల్డెన్‌ బాబా’  అనగానే టక్కున గుర్తుకు వస్తాడు. గత కొన్నేళ్లుగా కన్వార్‌ యాత్రలో ఈ గోల్డెన్‌ బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ గోల్డెన్‌ బాబాతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా బాబా మాట్లాడుతూ.. ‘ఇది నా 26వ కన్వార్‌ యాత్ర. గత ఏడాదితో 25 కన్వార్‌ యాత్రలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గత ఏడాది మేం సిల్వర్‌ జూబ్లీ వేడుకలు కూడా జరుపుకున్నాం. ఈ ఏడాది జూలై 21న కన్వార్‌ యాత్ర ఢిల్లీ నుంచి ప్రారంభించాం. అయితే తొలుత ఈ ఏడాది కన్వార్‌ యాత్రకు దూరంగా ఉందామనుకున్నాను. కానీ నా అనుచరులు, అభిమానులు ఒత్తిడి చేయడంతో సరేనని ఒప్పుకున్నాను. పరమ శివుని అనుగ్రహంతో ఈ ఏడాది కూడా విజయవంతంగా కన్వార్‌ యాత్ర పూర్తి చేసుకున్నాను’ అని తెలిపారు.

‘ఇక నా ఒంటి మీద ఉన్న బంగారం నాకు ప్రత్యేక గుర్తింపు ఇస్తుందనడంలో సందేహం లేదు. బంగారం ధరించడం అంటే నాకు చాలా ఇష్టం. తొలుత 2-3గ్రాముల బంగారం ధరించేవాడిని. రాను రాను దాని బరువు పెంచుతూ పోయాను. ఈ ఏడాది 16కిలోల బంగారం ధరించి వచ్చాను. గతేడాదితో పోలిస్తే.. ఈ సారి 4కిలోల బంగారం తక్కువ ధరించాను. అయితే ఈ బంగారం అంతా నేను సొంతంగా సంపాదించుకున్నదే. ఎవరి దగ్గరి నుంచి విరాళాలు, డబ్బు స్వీకరించి కొన్న బంగారం కాదు’ అన్నారు. ఈ బాబా ధరించే ఆభరణాల్లో గొలుసులు, దేవతల లాకెట్లు, ఉంగరాలు, బ్రాస్‌లెట్లు ఉంటాయి. ప్రతి ఏడాది 250-300మంది అనుచరులతో బాబా కన్వార్‌ యాత్రలో పాల్గొంటారు. వారందరికి అవసరమైన ఆహారం, నీరు, అత్యవసర మందులతో పాటు సొంత అంబులెన్స్‌ను కూడా ఆయనే సమకూర్చుకుంటారు.

మరిన్ని వార్తలు