లాక్‌డౌన్‌ నిష్ర్కమణ వ్యూహాలపై కసరత్తు

1 May, 2020 17:43 IST|Sakshi

గ్రీన్‌జోన్స్‌లో సడలింపులకు మొగ్గు

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను సడలించడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో మంత్రుల బృందం శనివారం ఉదయం జరిగే భేటీలో విస్తృతంగా చర్చించనుంది. మహమ్మారి నిరోధానికి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ నుంచి ఎలా బయటకు రావాలనే వ్యూహాలపై ఈ భేటీలో మంత్రుల బృందం సమీక్షించనుంది. రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో ఆరోసారి సమావేశమవుతున్న మంత్రుల బృందం లాక్‌డౌన్‌ నియంత్రణలను దశలవారీగా సడలించడంపై ప్రధాని నరేంద్ర మోదీకి తమ నివేదికను అందచేస్తారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు మే 3 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ను మరోసారి ప్రభుత్వం పొడిగిస్తుందా లేక హాట్‌స్పాట్స్‌కే లాక్‌డౌన్‌ నియంత్రణలను పరిమితం చేస్తుందా అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై ప్రధాని మోదీ విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. హోంమంత్రి అమిత్‌ షా, పౌరవిమానయాన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌లతో శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ చర్చలు జరిపారు. ఇక రెడ్‌జోన్స్‌ను మినహాయించి ఇతర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌కు నియంత్రణలతో కూడిన సడలింపులను ప్రకటిస్తారని భావిస్తున్నారు.

చదవండి : 3 తర్వాత లాక్‌డౌన్‌ సడలింపు పక్కా..

మరిన్ని వార్తలు