గూగుల్‌ ‘గ్రహాంతర’ డూడుల్‌

17 Nov, 2018 04:36 IST|Sakshi

న్యూఢిల్లీ: భూమికి ఆవల ప్రాణికోటి ఉందా? ఉంటే ఆ గ్రహాంతరవాసులు మనకన్నా బలమైన, తెలివైనవారా? వంటి రహస్యాల్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసతో శాస్త్రవేత్తలు 1974లో మనిషి ఆనవాళ్లతో ఓ మెసేజ్‌ను శూన్యంలోకి పంపారు. ఈ మెసేజ్‌ను ప్యుర్టొరికోలోని అరిసిబో అబ్జర్వేటరీ నుంచి రేడియో టెలిస్కోప్‌ సాయంతో ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాల ద్వారా పంపించారు. ఇది జరిగి శుక్రవారం నాటికి సరిగ్గా 44 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ మెసేజ్‌లో ఒక భాగమైన ‘హ్యూమానిటీ’ చిత్రాన్ని సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్‌ తన డూడుల్‌గా పెట్టింది.

3 నిమిషాల నిడివిగల అరిసిబో మెసెజ్‌లో 1 నుంచి 10 అంకెలు, పలు మూలకాల పరమాణు సంఖ్యలు, మనిషి డీఎన్‌ఏ, మనిషి రూపం (హ్యూమానిటీ), టెలిస్కోప్‌ వంటి చిత్రాలతో7 భాగాలున్నాయి. ఈ సమాచారమంతా డిజిటల్‌(1,0) రూపంలో ఉంటుంది. హ్యూమానిటీ చిత్రంలో మధ్య భాగం మానవుడి రూపం, ఎడమవైపున్న చిత్రం సగటు యుక్త వయసు పురుషుడి ఎత్తు (5.94 అడుగులు), కుడివైపున్న ఆకారం 1974లో భూమిపై ఉన్న జనాభా(430కోట్లు)ను సూచిస్తుంది. గమ్యం దిశగా ఇప్పటికి ఈ మెసేజ్‌ 259 ట్రిలియన్‌ మైళ్లు ప్రయాణించింది.

>
మరిన్ని వార్తలు