ఆహార బిల్లును ఇలా సవరిద్దాం..!

22 Aug, 2013 05:42 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆహార భద్రత బిల్లుకు ప్రభుత్వం కొన్ని సవరణలు చేసే అవకాశముంది. విపక్షాలు లేవనె త్తిన ఆందోళనలను తొలగించేందుకు బిల్లులో కొన్ని సవరణలు చేయనున్నట్లు సమాచారం. మంగళవారం పార్లమెంటులో బొగ్గు స్కాం, ఉల్లి ధరలు వంటి అంశాలపై రభసతో బిల్లుపై చర్చకు ఆటంకం కలగడం తెలిసిందే. గురువారం లోక్‌సభలో బిల్లుపై చర్చ జరుగుతుందని, దానికి సభ ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. ఆహార భద్రత పథకానికి సంబంధించి విపక్షాలు  265 సవరణలు సూచించాయి.  పథకాన్ని అందరికీ వర్తింపజేసి, తిండిగింజలతోపాటు పప్పు ధాన్యాలు, వంటనూనె, చక్కెరలను చేర్చి, మనిషికి నెలకు 5 కేజీలకు బదులు 7 కేజీల ధాన్యమివ్వాలన్నది వీటి సారాంశం. ఆహార సబ్సిడీని నగదు రూపంలో చెల్లించవద్దన్నది మరో కీలక సవరణ. ఈ సవరణల్లో కొన్నింటి గురించి క్లుప్తంగా..
 
 బీజేపీ..: ఆహార సబ్సిడీకి సంబంధించి ఆధార్ సంఖ్య ప్రాతిపదికన చేపట్టిన సంస్కరణలను, నగదు సబ్సిడీని రద్దు చేయాలి. పౌష్టికాహార లేమితో బాధపడుతున్న పిల్లలకు ఉచిత భోజన సదుపాయం కల్పించాలి. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఇది ఉత్పాదక వ్యయానికంటే 1.5 రెట్లు ఎక్కువగా ఉండాలి.
 
 వామపక్షాలు..: బిల్లులో ప్రతిపాదించినట్లు 67 శాతం జనాభాకే కాకుండా మొత్తం జనాభాకు ఆహార భద్రత కల్పించాలి. నగదు సబ్సిడీ విధానాన్ని రద్దు చేయాలి. పేదలకు ఒక పూట ఉచిత భోజనం అందివ్వాలి.
 
 డీఎంకే..: ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్థ కింద రాష్ట్రాలకు ఇస్తున్న తిండిగింజల కోటాను ఇకముందూ కొనసాగించాలి.
 తృణమూల్ కాంగ్రెస్..: గ్రామాల్లో 90 శాతం మందికి, పట్టణాల్లో 75 శాతం మందికి ఆహార భద్రత కల్పించాలి.

మరిన్ని వార్తలు