ఫ్లెక్సీ ఫేర్‌ బాదుడు నుంచి ఊరట..

31 Oct, 2018 17:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని, దురంతో, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ వంటి ప్రీమియం రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్‌ స్కీమ్‌ కింద భారీ టిక్కెట్‌ ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రైలు ప్రయాణీకులకు ప్రభుత్వం ఊరట కల్పించనుంది. ప్రీమియం రైళ్లలో ఫ్లెక్సీ చార్జీలపై ప్రభుత్వం ప్రయాణీకులకు 50 శాతం డిస్కౌంట్‌ ప్రకటించవచ్చని భావిస్తున్నారు. చివరి నిమిషంలో టికెట్‌ బుక్‌ చేసుకునే వారితో పాటు రైళ్లు బయలుదేరే 4 రోజుల ముందుగా బుక్‌ చేసుకున్న వారికి 100కు పైగా ప్రీమియం రైళ్లలో డిస్కౌంట్‌ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.

కాగా 40 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్‌ టికెట్లపై 20 శాతం డిస్కౌంట్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిసింది. రైల్వే ప్రయాణీకులకు భారీ ఊరట కల్పించే నూతన చార్జీల స్కీమ్‌ను సార్వత్రిక ఎన్నికల ముందుగా ప్రభుత్వం ప్రకటిస్తుందని భావిస్తున్నారు. ఫ్లెక్సీ ఫేర్‌ విధానంతో పలు రూట్లలో రైల్వే చార్జీలు విమాన చార్జీల కంటే అధికంగా ఉన్నాయని కాగ్‌ ఆక్షేపించిన క్రమంలో ప్రభుత్వం నూతన చార్జీలపై దృష్టిసారించిందని సమాచారం.

మరిన్ని వార్తలు