స్వదేశీ డిజిటల్‌ మ్యాప్‌

17 Sep, 2019 03:58 IST|Sakshi

10 సెంటీమీటర్ల కచ్చితత్వంతో రెండేళ్లలో అందుబాటులోకి

బెంగళూరు: మీరు గూగుల్‌ మ్యాప్‌ వాడుతున్నారా ? గమ్యస్థానం చేరినప్పటికీ మ్యాప్‌లో కొద్ది మీటర్ల దూరం తేడా వచ్చిందా ! గూగుల్‌ మ్యాప్స్‌లో కచ్చితత్వం, కొన్ని మీటర్ల తేడాతో ఉండటం వల్ల ఈ సమస్యలు తలెత్తున్నాయి. దీన్ని అధిగమించేందుకు భారత్‌లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలోని సర్వే ఆఫ్‌ ఇండియా నడుం కట్టింది. డిజిటల్‌ మ్యాప్‌గా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా కచ్చితత్వాన్ని 10 సెంటీమీటర్ల తేడాతో గుర్తించేలా డిజిటల్‌ మ్యాప్‌ను తయారుచేయబోతోంది. దీనికోసం డ్రోన్లను, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, బిగ్‌డేటాను ఉపయోగించుకుంటోందని ప్రభుత్వ సీనియర్‌ అధికారి వెల్లడించారు.  

కచ్చితమైన కొలతలతో...
ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక మ్యాపును ప్రజలకు, గ్రామ పంచాయతీలకు, ప్రభుత్వ అధికారులకు అందివ్వనున్నారు. దీనివల్ల పరిపాలనా పరమైన ప్రయోజనాలు కూడా ఉండేలా రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, హరియాణా, మహారాష్ట్ర, గంగా బేసిన్‌లో మ్యాప్‌ కోసం సర్వే ప్రారంభించారు. గంగా బేసిన్‌కు ఇరువైపులా 25 కిలోమీటర్ల దూరంపాటు 10 సెంటీమీటర్ల కచ్చితత్వంతో మ్యాపింగ్‌ చేస్తున్నట్లు సర్వే అధికారి ప్రొఫెసర్‌ శర్మ వెల్లడించారు.  

డిజిటల్‌ రిఫరెన్స్‌ పాయింట్లు...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో కలసి ఈ ప్రాజెక్టు చేపట్టామన్న వార్తలు అవాస్తవమని ప్రొఫెసర్‌ శర్మ తెలిపారు. సాధారణంగా శాటిలైట్లు ఫొటోలు తీస్తాయని, ఇది అలాంటి సాంకేతిక కాదన్నారు. డ్రోన్లను ఉపయోగించి, మలుపులను పరిగణలోకి తీసుకొని తయారుచేసే హైరిజల్యూషన్‌ మ్యాప్‌ అన్నారు. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక డిజిటల్‌ రిఫరెన్స్‌ పాయింట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. వీటి ద్వారా అక్షాంశాలు, రేఖాంశాలను కచ్చితత్వంతో విభజించడంతోపాటు 10 సెంటీమీటర్ల కచ్చితత్వంతో మ్యాప్‌       ఉంటుందన్నారు. గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌) కొద్ది మీటర్ల తేడాతో ప్రదేశాలను గుర్తిస్తే ఇందులో ఆ తేడా స్వల్పమన్నారు.   

మరిన్ని వార్తలు