లక్నో: ఉత్తరప్రదేశ్ కాస్గంజ్లో జరిగిన మతఘర్షణలపై ఆ రాష్ట్ర గవర్నర్ రామ్నాయక్ తీవ్రంగా స్పందించారు. ఈ అల్లర్లు రాష్ట్ర ప్రతిష్టకు మచ్చలాంటివని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ మతఘర్షణలు సిగ్గుచేటు అని ఆయన వ్యాఖ్యానించారు. గత తొమ్మిది, పది నెలల్లో మతఘర్షణలు జరగడం ఇదే తొలిసారి అని గుర్తుచేశారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణలతో అట్టుడికిన కాస్గంజ్లో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా.. అదుపులోనే ఉంది. ఇక్కడ జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి మృతిచెందిన సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ వర్గం బైకు ర్యాలీ నిర్వహించగా.. మరో వర్గం నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న రాళ్లదాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.