సెక్షన్‌ 69 బాంబు : మండిపడుతున్న ప్రతిపక్షాలు

21 Dec, 2018 18:41 IST|Sakshi

ఐటీ చట్టం 2000 సెక్షన్‌ 69  బూచి

ఈ మెయిల్స్‌ కేంద్రం నిఘా

మన అనుమతిలేకుండా ఈమెయిల్స్‌, సందేశాలు తనిఖీ

10 ఏజెన్సీలకు అధికారాలు

సహకరించకపోతే ఏడేళ్ల జైలు శిక్ష

సాక్షి, న్యూఢిల్లీ: కంప్యూటర్లు వాడే భారతీయులకు షాకింగ్‌ న్యూస్‌. మన కంప్యూటర్లలోని ప్రయివేటు మెసేజ్‌లుకు, ఈమెయిల్స్‌ ఇక నిఘా నీడలోకి వెళ్లబోతున్నాయి.  హోం శాఖ తాజా  ఉత్తర్వుల ప్రకారం దేశంలో ప్రతీ ఒక్కరు వాడే కంప్యూటర్ల పై భారత ప్రభుత్వం డేగ కన్ను వేయనుంది. ఈ మేరకు 'సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ' డివిజన్ గురువారం రాత్రి 10 సెంట్రల్ ఏజన్సీలకు అనుమతినిచ్చేశారు హోం శాఖ  సెక్రటరీ రాజీవ్ గుబాబా.  అంటే అనుమతి లేకుండానే  కంప్యూటర్ వ్యవస్థలోకి చొరబడి మొత్తం సమాచారాన్ని పరిశీలించేందుకు,అవసరమైతే అడ్డుకునేందుకు  పూర్తి అధికారాన్ని కల్పించిందన్నమాట.

ఇందుకు ఇంటెలిజెన్స్ బ్యూరోతో సహా 10 దర్యాప్తు సంస్థలకు  అనుమతి అంశంపై కేంద్ర హోం శాఖ స్పందించింది. “కంప్యూటర్ లలో ఉన్న సమాచారంతో పాటు సెండ్ చేసిన, రిసీవ్ చేసుకున్న సమాచారంపై నిఘా  ఉంటుందని స్పష్టం   చేసింది. అవసరమైతే సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు అడ్డుకుంటాయని కూడా హోంశాఖ తెలిపింది. ఐటీ చట్టం 2000 సెక్షన్‌ 69 కింద ఈ ఆదేశాలు వ‌ర్తిస్తాయ‌ని చెప్పింది.

ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైర‌క్ట్ ట్యాక్సెస్‌, డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, సీబీఐ‌, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)  రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, క్యాబినెట్ సెక్రటేరియేట్‌, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, డైర‌క్ట‌రేట్ ఆఫ్ సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌( జమ్ము అండ్‌ కశ్మీర్‌, నార్త్ ఈస్ట్, అసోం) , ఢిల్లీ పోలీస్ తదితర సంస్థలు ఉన్నాయి. విచారణ ఎదుర్కొనే వారు  దర్యాప్తు సంస్థలకు అన్ని విధాల సహరించాల్సి ఉంటుంది. సహకరించకపోతే 7 సంవత్సరాల జైలుశిక్షతో పాటు జరిమానాను, ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మండిపడుతున్న ప్రతిపక్షాలు
ప్రభుత్వం చర్యను  కాంగ్రెస్‌, సీసీఎం, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదల్, తృణమూల్ కాంగ్రెస్‌  సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి, ఇది రాజ్యాంగ విరుద్ధమైన, అప్రజాస్వామికమైన ప్రాథమిక హక్కులపై దాడి అని మండిపడ్డారు.  కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ ప్రాథమిక హక్కు అయిన గోప్యతా హక్కుకు వ్యతిరేకం అని విమర్శించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని  సమాజ్‌వాదీ  పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్  పేర్కొన్నారు. రానున్న  ఎన్నికల తరుణంలో ఇలాంటి ఎత్తుగడలకు స్వస్తి పలకాలని డిమాండ్‌ చేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌  ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు