ఆ సిబ్బందికి భారీ రిస్క్‌ అలవెన్స్‌

26 Jun, 2020 08:58 IST|Sakshi

బోర్డర్‌ ఉద్యోగులకు ఊరట

సాక్షి, న్యూఢిల్లీ : దేశ సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం, మౌలిక ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులకు భారీగా వేతన పెంపు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది కనీస వేతనాన్ని 100 నుంచి 170 శాతానికి ప్రభుత్వం పెంచింది. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న లడఖ్‌ సెక్టార్‌లో పనిచేసే ఉద్యోగులకు అత్యధిక వేతన పెంపును వర్తింపచేశారు. పెరిగిన వేతనాలు జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని జాతీయ హైవేలు మౌలిక రంగ అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌) వెల్లడించింది. చైనా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో పనిచేసే సిబ్బందికి రిస్క్‌ అలవెన్స్‌ను 100 నుంచి 170 శాతానికి పెంచినట్టు ఆ సంస్థ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

తాజా ఉత్తర్వుల ప్రకారం డేటా ఎంట్రీ ఆపరేటర్‌ వంటి సాంకేతికేతర సిబ్బంది వేతనం నెలకు ప్రస్తుతమున్న 16,770 రూపాయల నుంచి 41,440 రూపాయలకు పెరిగింది. ఇక ఢిల్లీలో ఇదే పోస్టులో పనిచేసే వ్యక్తి వేతనం 28,000 రూపాయలు కావడం గమనార్హం. లడఖ్‌ ప్రాంతంలో పనిచేసే అకౌంటెంట్‌ వేతనం తాజా పెంపుతో 47,360 రూపాయలకు పెరిగింది. లడఖ్‌ ప్రాంతంలో పనిచేసే సివిల్‌ ఇంజనీర్‌ వేతనం గతంలో 30,000 రూపాయలు కాగా ఇప్పుడది రెట్టింపై 60,000 రూపాలకు చేరింది. సీనియర్‌ మేనేజర్‌ వేతనం 55,000 రూపాయల నుంచి 1,23,600కు పెరిగింది. వేతన ప్రయోజనాలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు రూ పది లక్షల ప్రమాద బీమాను పొందుతారు. వారికి టీఏ, డీఏ, పీఎఫ్‌ వంటి సదుపాయాలనూ వర్తింపచేస్తారు. చదవండి : ఈ నెల పూర్తి వేతనం

మరిన్ని వార్తలు