పార్లమెంట్‌ ముందుకు రఫేల్‌పై కాగ్‌ నివేదిక

30 Jan, 2019 13:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో రఫేల్‌ ఒప్పందంపై కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదకను ప్రభుత్వం సభ ముందుంచవచ్చని భావిస్తున్నారు. రఫేల్‌ ఒప్పందంతో పాటు పలు రక్షణ ఒప్పందాలపై కాగ్‌ లేవెనెత్తిన పలు ప్రశ్నలకు ఇప్పటికే ప్రభుత్వం సమాధానాలు ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన పత్రాలన్నింటినీ కాగ్‌కు అందుబాటులో ఉంచామని గత నెలలో రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై కాగ్‌ నివేదిక కోసం వేచిచూస్తున్నామని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రఫేల్‌ సహా రక్షణ ఒప్పందాలపై కాగ్‌ నివేదికను పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రభుత్వం బహిర్గతం చేయవచ్చని అధికార వర్గాలు సంకేతాలు పంపాయి. కాగా, రఫేల్‌ ఒప్పందంపై ఇప్పటికే కాంగ్రెస్‌ సహా విపక్షాలు మోదీ సర్కార్‌ను ఇరుకునపెడుతున్న క్రమంలో ఈ వ్యవహారంపై కాగ్‌ నివేదిక పార్లమెంట్‌లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు