బాటిళ్లలో ‘మహువా’ అమ్మకాలు

30 Jul, 2018 05:20 IST|Sakshi

న్యూఢిల్లీ: సంప్రదాయ గిరిజన పానీయం ‘మహువా’ను బాటిళ్లలో నింపి మార్కెటింగ్‌ చేయాలని కేంద్రం యోచిస్తోంది. వన్‌ధన్‌ కార్యక్రమం కింద గిరిజన ఉత్పత్తులకు ప్రచారం కల్పించడంలో భాగంగా ఈ దిశగా ఆలోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ, గిరిజన సహకార మార్కెటింగ్‌ సమాఖ్య ట్రైఫెడ్‌తో అవగాహనా ఒప్పందం కుదర్చుకుందని అధికారులు తెలిపారు. అయితే మహువాలో ఆల్కహాల్‌ పాళ్లు ఉన్నందున దాని అమ్మకానికి ఇంకా పలు అనుమతులు రావాల్సి ఉంది.

బాటిళ్లలో నింపే సమయంలోనే ఈ పానీయానికి అల్లం, వాము కలిపితే మరింత రుచికరంగా మారుతుందని ట్రైఫెడ్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. గిరిజనుల ఏ వేడుకలోనైనా సేవించే ఈ పానీయాన్ని మహువా పువ్వుల నుంచే తయారుచేస్తారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లోని గరిజన ప్రాంతాల నుంచి ఈ ఉత్పత్తిని సేకరిస్తారు. గిరిజనుల ఇతర ఉత్పత్తులైన చింతపండు, ఉసిరిని కూడా జామ్‌ రూపంలో మార్కెటింగ్‌ చేయాలని కూడా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది.  

మరిన్ని వార్తలు