సివిల్స్‌ కేటాయింపులో మార్పులకు యోచన

21 May, 2018 05:41 IST|Sakshi

న్యూఢిల్లీ: సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు సర్వీసుల కేటాయింపులో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం సివిల్స్‌ పరీక్షలో సాధించిన ర్యాంకుల అధారంగా అభ్యర్థులకు సర్వీస్‌ కేటాయిస్తున్నారు. అనంతరం మూడు నెలల ఫౌండేషన్‌ కోర్సును పూర్తిచేశాక అభ్యర్థులు తమతమ సర్వీసుల్లో చేరుతున్నారు. అయితే ఈ ఫౌండేషన్‌ కోర్సు పూర్తయిన తర్వాతే అభ్యర్థులకు సర్వీసుల్ని కేటాయించే విషయాన్ని పరిశీలించాలని సంబంధిత విభాగాలను ప్రధాని కార్యాలయం(పీఎంవో) కోరింది. సివిల్స్, ఫౌండేషన్‌ కోర్సులో పొందిన ఉమ్మడి మార్కుల ఆధారంగా సర్వీసుల్ని కేటాయించే అంశాన్ని సమీక్షించాలంది. సివిల్స్‌ విజేతలను ఇండియన్‌ రెవిన్యూ సర్వీస్, ఇండియన్‌ టెలికమ్యూనికేషన్స్‌ సర్వీస్‌ వంటి ఇతర కేంద్ర సర్వీసులకు కేటాయించే అంశంపై అభిప్రాయాలను తెలియజేయాలని సంబంధిత విభాగాలను కోరింది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రతిఏటా సివిల్‌ సర్వీస్‌ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు