లక్నో : కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)కు కరోనా వైరస్ కళ్లెం వేసింది. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెబర్లో తొలి విడత కార్యక్రమానికి ప్రారంభించాలని భావించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా ప్రజా జీవనమంతా స్థంభించిపోవడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్పీఆర్ ప్రక్రియను ఏడాది పాటు వాయిదా వేసింది. జాతీయ జనాభా పట్టిక ప్రక్రియను చేపట్టేందకు ప్రస్తుతం రాష్ట్రంలో సరైన సదుపాయాలు లేనందున 2021 వరకు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 2021 ఏప్రిల్ వరకు ఎలాంటి ప్రక్రియను ప్రారంభించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
కాగా ఎన్పీఆర్కు సంబంధించిన తొలివిడత సమాచార సేకరణ 2020 ఏప్రిల్లో ప్రారంభమై సెప్టెంబర్లో ముగుస్తుందని కేంద్ర కేబినెట్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిసారి ఎన్పీఆర్ 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 2015లో ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని అమలు చేసిన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్పీఆర్ను నవీకరించింది. ఎన్పీఆర్ ప్రక్రియ పూర్తయ్యాక 2021లో జనాభా గణన ఉంటుంది. కాగా ఎన్పీఆర్ను పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.