కోవిడ్‌-19 : ఇట్టే కోలుకుంటున్నారు..

13 Jul, 2020 19:51 IST|Sakshi

భారీగా మెరుగైన రికవరీ రేటు 

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు ఉధృతంగా నమోదవుతూ పాజిటివ్‌ కేసుల సంఖ్య 8.49 లక్షలకు ఎగబాకినా సానుకూల పరిణామాలూ చోటుచేసుకుంటున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్‌-19 నుంచి 18,850 మంది కోలుకున్నారని, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 5,53,470కి పెరిగింది. కరోనా వైరస్‌ నుంచి కోలుకునే వారిని సూచించే రికవరీ రేటు 63.20 శాతానికి చేరుకోవడం ఊరట కలిగిస్తోంది. 19 రాష్ట్రాలు జాతీయ సగటు కన్నా అధికంగా రికవరీ రేటును నమోదు చేశాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా వైరస్‌ కేసులు అధికంగా వెలుగుచూస్తున్న రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లో పలు చర్యలను చేపడుతున్నాయి.

యూపీ, మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాలు వారాంతాల్లో కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న నగరాల్లో లాక్‌డౌన్‌ను కఠినతరం చేశాయి. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 28,701 తాజా కరోనా వైరస్‌ కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,78,254కు చేరింది. మరణాల సంఖ్య 23,174కు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల్లో భారత్‌ మూడో స్ధానానికి చేరింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు ఏకంగా 1.3 కోట్లకు ఎగబాకాయి. ప్రాణాంతక వైరస్‌ బారినపడి ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా మరణించారు. చదవండి : అనుమానితుల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు 

మరిన్ని వార్తలు