వరుడి తండ్రితో వెళ్లిపోయిన వధువు తల్లి..!

21 Jan, 2020 14:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అహ్మదాబాద్‌ : ఎన్నో ఆశలు, కలలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టాలని భావించిన ఓ జంటకు ‘తల్లిదండ్రుల’ నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. వరుడి తండ్రితో కలిసి వధువు తల్లి పారిపోవడంతో వారి పెళ్లి ఆగిపోయింది. మానవ సంబంధాలను మంటగలిపిన ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాలు... కటార్‌గ్రాంకి చెందిన ఓ వ్యక్తి(48), నవ్సారీకి చెందిన వివాహిత(46) గతంలో ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉండేవారు. ఈ క్రమంలో వారి కుటుంబాల మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

కాగా వివాహితకు పెళ్లీడుకొచ్చిన కూతురు ఉంది. దీంతో సదరు వ్యక్తి కొడుకుకు ఆమెను ఇచ్చి పెళ్లి చేయాలని ఇరు వర్గాలు నిశ్చయించాయి. ఈ క్రమంలో ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఓవైపు పెళ్లి పనులు జరుగుతుండగానే.. జనవరి 10 నుంచి వరుడి తండ్రి, వధువు తల్లి అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా వారిద్దరు చిన్ననాటి నుంచి స్నేహితులని.. గతంలో ఒకరినొకరు ఇష్టపడ్డారని అందుకే ఇప్పుడు పారిపోయి ఉంటారని బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇందుకు సంబంధించిన వార్తలు, వారిద్దరి ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు