కల్యాణ మండపం నచ్చలేదని వరుడు పరార్‌

3 Mar, 2018 17:28 IST|Sakshi

సాక్షి, కర్ణాటక (దేవనహళ్లి) : కల్యాణమండపం నచ్చడం లేదని వరుడు ఇంటి నుంచి ఉడాయించాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అతన్ని పట్టుకొచ్చి పోలీస్‌ స్టేషన్‌లో వివాహం జరిపించారు. ఈ ఘటన దేవనహళ్లి తాలూకా విశ్వనాథపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. తాలూకాలోని సుణ్ణఘట్ట గ్రామానికి చెందిన ఆనంద్‌ అనే యువకుడికి, తరహుణసె గ్రామానికి చెందిన శోభ అనే యువతికి స్థానిక పటాలమ్మ కల్యాణమండపంలో శుక్రవారం వివాహం జరపాలని పెద్దలు నిశ్చయించారు. వధువు తరపు పెద్దలు వధువుతో కలిసి కల్యాణ మండపం చేరుకున్నారు. ఇంతలో వరుడు ఆనంద్‌ వధువు బంధువులకు ఫోన్‌ చేసి తనకు ఈ వివాహం ఇష్టంలేదని చెప్పి ఉడాయించాడు. కంగారుపడ్డ వధువు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఎస్సై శ్రీనివాస్‌ సాయంత్రానికల్లా వరుడిని పట్టుకొచ్చారు. పోలీస్‌స్టేషన్‌లోనే వధువుకు తాళికట్టించి వివాహం జరిపించేశారు. వివాహం ఎందుకు వద్దన్నావు అని పోలీసులు ప్రశ్నించగా కల్యాణమండపం నచ్చలేదని, అందుకే వివాహం వద్దన్నానని నవ్వుతూ సమాధానం చెప్పాడు.

మరిన్ని వార్తలు