పెళ్లి మండపం వద్దే వరుడి చెంప చెళ్లుమనిపించింది!

21 Apr, 2015 12:41 IST|Sakshi
పెళ్లి మండపం వద్దే వరుడి చెంప చెళ్లుమనిపించింది!

డెహ్రాడూన్: ఓ పెళ్లి మండపం వద్ద చేసుకున్న ఘటన అచ్చం సినిమాలో క్లైమాక్స్ ను తలపించింది. అంగరంగం వైభవంగా పెళ్లికి సిద్ధమైన ఓ వరుడి చెంప చెళ్లుమనిపించింది అతని మాజీ ప్రేయసి. అది హరిద్వార్ లోని అవదిపుర్హాల్ గ్రామం. కాసేపట్లో జరిగే పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. వరుడు తరుపు వారు, వధువు తరపువారు పెళ్లి వేడుకను తిలకించడానికి ఆసీనులై ఉన్నారు. అయితే ఈ లోగా ఓ ట్విస్ట్. వరుడి ప్రేమించి మోసం చేసిన మాజీ ప్రేయసి ఆ వేడుక వద్ద దర్శనిమిచ్చింది. తనను ప్రేమించి  వేరే అమ్మాయిని చేసుకుంటావా అంటూ నిలదీసింది. దీనికి పెళ్లి కొడుకు ముఖం చాటేయడంతో.. అతనిపై ఆక్రోశం వ్యక్తం చేసింది. ఇక సహనం కోల్పోయిన ఆ యువతి వరుడి చెంప చెళ్లుమనిపించింది. ఈ ఘటనతో పెళ్లి మండంలో అలజడి రేగింది. ఆ వరుడి మాజీ ప్రేయసిని అక్కడున్న ఇతర అతిథులు అడ్డుకున్నారు. 'అతనితో నాకు కోర్టు  ద్వారా గతంలోనే పెళ్లి అయిందని.. చాలా కాలం నుంచి తామిద్దరం 'సహజీవనం'చేస్తున్నామని అక్కడున్న పెద్దలకు స్పష్టం చేసింది. నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈసారి చెంప చెళ్లు మనిపించడం సరిపెట్టను. నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తా' అంటూ ఆ యువతి వరుడికి వార్నింగ్ ఇచ్చి వెళ్లింది.

ఈ సన్నివేశాన్ని కళ్లారా చూసిన  'నవ వధువు' ఆ వరుడు తనకొద్దంటూ పెళ్లిని రిజెక్ట్ చేసింది. ఈ గొడవ అక్కడ పంచాయతీ వరకూ  వెళ్లింది. ఆ పంచాయతీ  పెద్దలు తీర్పు ఏమి ఇస్తారా?అని అంతా ఆసక్తిగా గమనించారు. అయితే పంచాయతీ పెద్దలు ఒక మంచి తీర్పుతో ఇరు కుటుంబాల మధ్య రాజేసుకున్న విభేదాలను చల్లార్చాలని భావించారు. ఆ వరుని తమ్మునితో అమ్మాయి పెళ్లి చేస్తే బాగుంటందనే సలహా ఇచ్చారు. దీనికి రెండు పక్షాల నుంచి మద్దతు రావడమే కాకుండా.. ఆ వధువుకు అందుకు సమ్మతించింది. గత ఆదివారం ఆ జంట దండలు మార్చుకుని ఒక్కటైంది.

మరిన్ని వార్తలు