నేడు జీఎస్టీ మండలి సమావేశం
న్యూఢిల్లీ: రిటర్నుల ఫైలింగ్ను సులభతరం చేయడం, ఈ–వే బిల్లుల జారీకి జీఎస్టీ నెట్వర్క్ సన్నద్ధతను సమీక్షించడమే ప్రధాన అజెండాగా జీఎస్టీ మండలి సమావేశం గురువారం జరగనుంది. బడ్జెట్ సమర్పణకు ముందు నిర్వహిస్తున్న ఈ భేటి 25వది కావడం గమనార్హం. జీఎస్టీ రేట్లను తగ్గించాలని పలు వర్గాల నుంచి వచ్చిన విన్నపాలను కూడా మండలి పరిశీలించే అవకాశాలున్నాయి.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో సుమారు 70 వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం వెలువడుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనవరి 29 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించేందుకు వీలుగా జీఎస్టీ చట్టంలో సవరణలకు మండలి ఆమోదం తెలపొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.