‘పద్మావతి’కి షాకిచ్చిన గుజరాత్‌

22 Nov, 2017 19:56 IST|Sakshi

అహ్మదాబాద్‌: ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రాణి పద్మావతి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రదర్శనను ఇప్పటికే మధ్యప్రదేశ్‌ నిషేధించగా.. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న  గుజరాత్‌ సైతం ఇదే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో సినిమా విడుదలను నిషేధిస్తున్నట్టు గుజరాత్‌ సీఎం విజయ్‌ రుపానీ తెలిపారు. ’గుజరాత్‌లో పద్మావతి సినిమా విడుదల కావడానికి ప్రభుత్వం అనుమతించబోదు. ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఈ సినిమా వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్త అవకాశముంది. ఈ సినిమా వల్ల ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. పలు వర్గాలు ఈ సినిమా విడుదలను వ్యతిరేకిస్తున్నాయి’ అని రూపానీ విలేకరులతో అన్నారు.

పద్మావతి’ సినిమా వివాదం దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుపుతున్న రాజ్‌పుత్‌లు.. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, టైటిల్‌ రోల్‌ పోషించిన దీపికా పదుకోన్‌లను చంపేస్తామని, వారి తలలు నరికితే.. నజరానాలు ఇస్తామని బెదిరింపులకు దిగుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు