హార్ధిక్‌ పటేల్‌కు హైకోర్టు షాక్‌

29 Mar, 2019 18:47 IST|Sakshi

అహ్మదాబాద్‌ : కాంగ్రెస్‌లో చేరిన పటేల్‌ ఉద్యమ నేత హార్ధిక్‌ పటేల్‌ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశలకు గుజరాత్‌ హైకోర్టు గండికొట్టింది. మెహసనా జిల్లాలో ఓ అల్లర్ల కేసులో సెషన్స్‌ కోర్టు తనను దోషిగా పేర్కొనడాన్ని కొట్టివేయాలని కోరుతూ హార్థిక్‌ పటేల్‌ అభ్యర్ధనను హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగాలని పటేల్‌ భావిస్తుండగా, గుజరాత్‌ హైకోర్టు ఉత్తర్వులు ఆయన ఆశలపై నీళ్లుచల్లాయి.

మెహసనా జిల్లాలో జరిగిన ఘర్షణల కేసులో సెషన్స్‌ కోర్టు హార్ధిక్‌ పటేల్‌ను గత ఏడాది జులైలో దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే తనను దోషిగా నిర్ధారిస్తూ సెషన్స్‌ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని హార్ధిక్‌ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హార్ధిక్‌కు శిక్షను రద్దు చేసిన హైకోర్టు ఆయనకు గత ఏడాది ఆగస్టులో బెయిల్‌ మంజూరు చేసింది.

దిగువ కోర్టు హార్ధిక్‌ను దోషిగా తేల్చడంపై మాత్రం హైకోర్టు స్టే ఇవ్వలేదు. అయితే ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పటేల్‌ కాంగ్రెస్‌ నుంచి జామ్‌నగర్‌ లోక్‌సభ స్దానం నుంచి బరిలో దిగాలని యోచిస్తుండగా, గుజరాత్‌ హైకోర్టు ఆయన అభ్యర్ధనను తోసిపుచ్చడంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం హార్థిక్‌ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది.

మరిన్ని వార్తలు