పిల్లల పెళ్లి.. ఆ జంట మళ్లీ జంప్‌!

2 Mar, 2020 10:52 IST|Sakshi
హిమ్మత్‌(ఎడమ), అతడి కుమారుడు(కుడి)(ఫైల్‌)

సూరత్‌ : వరుడి తండ్రితో వధువు తల్లి పారిపోయిన ఘటన మరో మలుపు తిరిగింది. కొద్దిరోజుల క్రితం ఇంటికి తిరిగొచ్చిన ప్రేమికుల జంట మరోసారి పారిపోయింది. పిల్లలకు పెళ్లి చేయాల్సిన ఆ జంట నెలరోజుల గ్యాపులో రెండు సార్లు ఇంటి నుంచి పారిపోవటం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. సూరత్‌కు చెందిన హిమ్మత్‌ పాండవ్‌(46), నవ్‌సారికి చెందిన శోభ్న రావల్‌(43)లు చిన్నతనంలో ఒకే ఊర్లో కలిసి ఉండేవారు. ఇద్దరు ప్రేమించుకున్నప్పటికి కొన్ని అనివార్యకారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయారు. ఆ తర్వాత శోభ్నకు పెళ్లి జరగటంతో ఆమె నవ్‌సారికి వెళ్లిపోయింది. చాలా ఏళ్ల తర్వాత తమ పిల్లలకు పెళ్లి చేయటానికి ఈ జంట కలిసింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరిమధ్యా పాత జ్ఞాపకాలు పురులు విప్పాయి, మళ్లీ ప్రేమ చిగురించింది. ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తం ఖరారై పనులు కూడా శరావేగంగా జరిగిపోతున్నాయి. 

పెళ్లికి ఇంకో వారం ఉందనగా జనవరి 10న హిమ్మత్‌, శోభ్నలు ఇంటినుంచి పారిపోయారు. దీంతో కుటుంబసభ్యులు మిస్సింగ్‌ కేసు పెట్టారు. రెండు వారాల తర్వాత ఆ ఇద్దరు ఇళ్లుకు తిరిగొచ్చారు. అయితే శోభ్న భర్త ఆమెను ఇంట్లోకి రానివ్వక పోవటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఈ శనివారం ప్రేమికులిద్దరూ మరోసారి ఇళ్లనుంచి పారిపోయారు. వీరి విషయం తెలిసిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాగా, ప్రేమికుల జంట సూరత్‌లోని ఓ అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నట్లు సమాచారం. ( వరుడి తండ్రితో వెళ్లిపోయిన వధువు తల్లి..! )


 

మరిన్ని వార్తలు