ఆన్‌లైన్‌లో నిశ్చితార్థం.. వీడియో వైరల్‌

13 Feb, 2020 09:32 IST|Sakshi

ఈ మధ్య కాలంలో జనాలు అన్ని పనులు ఆన్‌లైన్‌లోనే కానిచ్చేస్తున్నారు. వేసుకునే దుస్తులు మొదలు.. తినే తిండి వరకూ అన్ని ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేస్తున్నారు. చివరికి సూదీ దారం కావాలన్న ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ ఇస్తున్నారు. ప్రేమానురాగాలు సైతం ఆన్‌లైన్‌లోనే చూపిస్తున్నారు. వ్యక్తులను ప్రత్యేక్షంగా కలుసుకోవడం మానేసి వీడియో కాల్‌ ద్వారా పలకరింపులు మొదలెట్టారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఓ గుజరాత్‌ ఫ్యామిలీ చేసిన పని మరో ఎత్తు. వారు ఏకంగా నిశ్చితార్థాన్నే ఆన్‌లైన్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన రెండు కుటుంబాలు తమ పిల్లలకి భారతీయ సాంప్రదాయ పద్దతిలో వివాహం చేయాలనుకున్నారు. దీనిలో భాగంగా నిశ్చితార్థ వేడుకకి ఒక తేదిని కూడా ఫిక్స్‌ చేశారు. కానీ వేరు, వేరు దేశాల్లో ఉన్నా అమ్మాయి, అబ్బాయి ఆ తేది నాటికి గుజరాత్‌ రాలేకపోయారు.

దీంతో పెద్దలు వారికి ఆన్‌లైన్‌లోనే నిశ్చితార్థ కార్యక్రమాన్ని జరిపారు. వాట్సాప్‌ ద్వారా వధూవరులకు వీడియో కాల్‌ చేశారు. అనంతరం రెండు ఫోన్‌లను పీటలపై ఉంచి ఆన్‌లైన్‌లోకి వచ్చిన అమ్మాయి, అబ్బాయికి తిలకం పెట్టారు. వస్త్రాలను కూడా వారికి చూపించి ఫోన్‌ వెనుకాల ఉంచారు. అనంతరం ఇంటి పెద్దలు అంతా అక్షింతలు వేసి ఆన్‌లైన్‌లోనే వారిని ఆశీర్వదించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. టెక్నాలజీని ఇలా కూడా వాడుకుంటున్నారా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు