పేలని తుపాకులు.. మాజీ సీఎం అంత్యక్రియల్లో అపశ్రుతి

22 Aug, 2019 18:29 IST|Sakshi

పట్నా ‌: బిహార్‌ మాజీ సీఎం జగన్నాథ్‌ మిశ్రా అంత్యక్రియలను జేడీయూ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 82 ఏళ్ల మిశ్రా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. సుపోల్‌ జిల్లాలోని ఆయన స్వగ్రామంలో బుధవారం అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం నితీష్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీలతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. అయితే జగన్నాథ మిశ్రా అంత్యక్రియల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. 

ఆయన పార్దివదేహానికి అంత్యక్రియలు నిర్వహించేటపుడు 22 మంది పోలీసులు గౌరవ వందనం సమర్పించవలసి ఉంది. వీరు తుపాకులను పేల్చినప్పుడు, కనీసం ఒక్క తూటా అయినా పేలలేదు. తుపాకులు మొరాయించడంతో చేసేదేమి లేక మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దీనిపై ఆర్జేడీ ఎమ్మెల్యే యద్వంశ్‌ కుమార్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది మిశ్రాను అవమానించినట్టేనని, దీనిపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు