పార్కింగ్ జోన్లపై దృష్టి

4 Nov, 2014 22:38 IST|Sakshi

 నోయిడా: నగరంలో పార్కింగ్ జోన్ల ఏర్పాటుపై నోయిడా అథారిటీ దృష్టి సారించింది. సెక్టార్ 18లో దుకాణాల వద్ద పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేయనుంది. అదే ప్రాంతంలోని గురుద్వారలో ఉచిత పార్కింగ్ జోన్ల సౌకర్యం కల్పించడానికి కసరత్తు చేస్తోంది.
 
 ఆర్నెళ్లలో అందుబాటులోకి..
 సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో పార్కింగ్ జోన్లను నిర్మించడానికి నిర్ణయించింది. వీటిని ఆర్నెళ్లలో అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తున్నట్లు గురుద్వార అధికారులు పేర్కొన్నారు. భూగర్భ ప్రాంతాల్లో సుమారు 2,200 చదరపు మీటర్లలో రెండు పార్కింగ్ జోన్లను నిర్మించనున్నట్లు చెప్పారు. ఇవి ఒకసారి పూర్తి అయితే, నిత్యం 150 వాహనాలను పార్క్ చేయడానికి అవకాశం ఉంటుంది.
 
 గురుద్వారాల్లో ఉచితం
 ఇంకా నగరంలోని మిగతా గురుద్వారాలైన బాంగ్లా సాహిబ్, రాక్బాగంజీ ప్రాంతాల్లో భక్తులకు ఉచితంగా పార్కింగ్ వసతి కల్పించనుంది. ఇక్కడ పార్కింగ్ వసతి కల్పించినందుకు ఎలాంటి చార్జీలు వసూలు చేయమని, ప్రజలు, భక్తులకు సేవలందించడమే ధ్యేయమని అధికారులు పేర్కొన్నారు. నోయిడాలోని సెక్టార్-18ని షాపింగ్ స్వర్గంగా పిలుస్తారు. ఇక్కడ రద్దీగా ఉంటుంది. వాహనాలు రోడ్లను ఆక్రమించి పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ అంతరాయం కల్గుతోంది. దీన్ని అధిగమించడం కోసమే పార్కింగ్ జోన్లను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.
 
 నిర్మాణంలో..
 ప్రస్తుతం రూ. 250 కోట్ల వ్యయంతో బహుళ ప్రయోజన పార్కింగ్ జోన్ నిర్మాణంలో ఉంది. ఇందులో సుమారు 4,000 వాహనాలను పార్కింగ్ చేసే అవకాశం ఉంది. ఇది 2016 వరకు పూర్తి అవుతుంది. ఇక్కడ పార్కింగ్ చార్జీలుంటాయి. నిర్ణీత సమయానికి రూ.200 , రూ. 300 చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.
 

మరిన్ని వార్తలు