న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వడగళ్ల వాన కురిసింది. శనివారం మధ్యాహ్నం దాటిన తర్వాత ఢిల్లీలోని పలుచోట్ల భారీ వర్షం, దాంతోపాటు వడగళ్లు పడ్డాయి. భీకరంగా గాలి వీచింది. దీంతో బిజీగా ఉండే రోడ్లపై భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. వడగళ్లతో రోడ్లపై ఉన్న జనం బెంబేలెత్తిపోయారు. అయితే, ఎండవేడిమి, ఉక్కపోతతో సతమతమైన ఢిల్లీ ప్రజలకు ఈ వర్షంతో చల్లని వాతావరణం లభించినట్టయింది.
ఇక పొరుగునే ఉన్న ఉత్తరప్రదేశ్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా గడచిన 24 గంటల్లో అకక్కడ 28 మంది మృతి చెందారు.పిలిబిత్, సీతాపూర్, చాందౌలీ, ముజాఫర్నగర్, భాగ్పట్, బిజ్నోర్, ఔన్పూర్ జిల్లాలపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. మరణించిన వారి కుటుంబాలకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రూ. 4 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది.