వాయుసేనలోకి ‘తేలికపాటి’ తేజస్‌

28 May, 2020 04:46 IST|Sakshi

స్క్వాడ్రన్‌ ఫ్లయింగ్‌ బుల్లెట్స్‌లోకి తేజస్‌ ఎంకే–1

కోయంబత్తూరు: భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) తన తొలి లైట్‌ కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌(ఎల్‌సీఏ) తేజస్‌ ఎంకే–1ను బుధవారం స్క్వాడ్రన్‌ నం.18 ఫ్లయింగ్‌ బుల్లెట్స్‌లోకి ప్రవేశపెట్టింది. తమిళనాడులోని కోయంబత్తూరు శివార్లలో సూలూరులో ఉన్న ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను బెంగళూరులోని హిందుస్తాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) రూపొందించింది. ఈ సందర్భంగా హెచ్‌ఏఎల్‌ చైర్మన్, ఎండీ ఆర్‌.మాధవన్‌ సంబంధిత పత్రాలను ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ బదౌరియాకు అందజేశారు. తేజస్‌ ఎంకే–1 నాలుగోతరం సూపర్‌సానిక్‌ కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో అతి తేలికైన, చిన్నదైన యుద్ధ విమానం.

ప్రత్యేకతలు..
► ఒక ఇంజిన్, డెల్టా వింగ్‌తో కూడిన నాలుగో తరం యుద్ధ విమానం.
►  హిందుస్తాన్‌ ఏరోనాటికల్స్‌ లిమిటెడ్‌లోని ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ దీన్ని డిజైన్‌ చేసింది.
► ధ్వని కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు.
► బరువు 6,560 కిలోలు
► 15 కిలోమీటర్ల ఎత్తులోనూ పనిచేయగలదు.
►  పొడవు 13.2 మీటర్లు... పరిధి
►  1,850 కిలోమీటర్లు

తేజస్‌ చరిత్ర
►  1983:     మిగ్‌–21 విమానాల స్థానంలో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తేలికపాటి యుద్ధ విమానాన్ని సిద్ధం చేసే ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.
► 1986:    తేలికపాటి యుద్ధ విమానం లేదా ఎల్‌సీఏ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.575 కోట్లు కేటాయించింది.
►  2001: ఎల్‌సీఏ తొలి ప్రయోగాత్మక పరీక్ష  
►  2003: ఎల్‌సీఏకు ‘తేజస్‌’ అని నామకరణం చేసిన అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి
► 2016: భారతీయ వాయుసేనలోని 48వ స్క్వాడ్రన్‌లో తొలిసారి తేజస్‌ నియామకం.  బహ్రెయిన్‌లో తొలిసారి అంతర్జాతీయ వేదికపై తేజస్‌ ప్రదర్శన
► 2017: 68వ గణతంత్ర దినోత్సవాల్లో తొలిసారి తేజస్‌ ప్రదర్శన
►  2018:    వాయుసేన నిర్వహించిన గగన్‌ శక్తి కార్యక్రమంలో సత్తా చూపిన తేజస్‌
►  2020: వాయుసేన 18వ స్క్వాడ్రన్‌లోకి తేజస్‌.

మరిన్ని వార్తలు