హన్సిక ఈజ్‌ ద బెస్ట్‌!

2 May, 2019 15:03 IST|Sakshi
తల్లితో ఆనందం పంచు​కుంటున్న హన్సిక శుక్లా

న్యూఢిల్లీ: చరిత్ర అంటే తనకెంతో ఇష్టమని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) పన్నెండో తరగతి పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన హన్సిక శుక్లా తెలిపింది. సీబీఎస్‌ఈ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఘజియాబాద్‌లోని ఢిల్లీ ప్లబిక్‌ స్కూల్‌లో చదివిన హన్సిక.. చరిత్ర, పొలిటికల్‌ సైన్స్‌, సైకాలజీ, హిందూస్తానీ వోకల్‌లో వందకు వంద మార్కులు సాధించింది. ఇంగ్లీషులో మాత్రమే 99 మార్కులు తెచ్చుకుంది.

‘ఫలితాలు వెలువడిన వెంటనే ఆఫీస్‌ నుంచి మా నాన్న ఫోన్‌ చేశారు. నేను చూసుకోలేదు. తర్వాత మా అమ్మ కాల్‌ చేసి అభినందనలు తెలిపింది. టాప్‌లో నిలిచానని చెప్పడంతో నమ్మలేకపోయాన’ని హన్సిక ‘ఏబీపీ’ వార్తా సంస్థతో చెప్పింది. తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని వెల్లడించింది. హన్సిక తల్లి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, తండ్రి రాజ్యసభ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

సోషల్‌ మీడియాకు దూరంగా ఉండి, ప్రతి సబ్జెక్ట్‌పై ఫోకస్‌ చేయడం వల్లే పరీక్షల్లో టాపర్‌ నిలిచానని హన్సిక తెలిపింది. డిగ్రీలో సైకాలజీ చదివి ఇండియన్‌ ఫారిన్ సర్వీసులో చేరాలన్నదే తన లక్ష్యమని పేర్కొంది. శాస్త్రీయ సంగీతం, బాలీవుడ్‌, ఇంగ్లీషు పాటలు వింటూ రిలాక్స్‌ అవుతుంటానని వెల్లడించింది. జంక్‌ ఫుడ్‌ చాలా తక్కువగా తీసుకుంటానని, పనీర్‌ అంటే తనకు చాలా ఇష్టమని హన్సిక తెలిపింది. (500కు 499 మార్కులు.. మళ్లీ వాళ్లే టాప్‌!)

మరిన్ని వార్తలు