ఒక లీటర్ తాగి చెప్పండి..ఎలా ఉందో..!

24 Nov, 2019 16:14 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశంలోని ప్రముఖ నగరాల్లో నల్లా నీళ్ల నాణ్యతపై కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఆ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) చేసిన సర్వేలో దేశ రాజధాని ఢిల్లీ నగర నల్లా నీళ్ల నాణ్యత అధ్వానంగా ఉందని వెల్లడైంది. ఢిల్లీతో పాటు మరో 13 నగరాల్లో నీటి నాణ్యత బాగోలేదని బీఐఎస్‌ పేర్కొంది. అయితే, నీటి నాణ్యత అంశాన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. ప్రజలకు మెరుగైన తాగునీటి వసతిని కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. 
(చదవండి : ముంబై నీళ్లు అమోఘం)

ఇక బీఐఎస్‌ రిపోర్టుని తప్పుబట్టిన కేజ్రీవాల్‌పై విమర్శల దాడి కొనసాగుతోంది. దేశంలో అందరూ బీఎస్‌ఐ రిపోర్టును అంగీకరిస్తుండగా.. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీ సీఎం యత్నిస్తున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కేజ్రీవాలే నీటి సమస్యను రాజకీయం చేస్తున్నారని కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ విమర్శించారు. కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి ట్విటర్‌ వేదికగా.. ‘ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌.. నగర ప్రజలు తాగుతున్న నీరు మరీ అధ్వానంగా లేదని అంటున్నారు. మరైతే.. అక్కడి నీరు ఒక లీటర్‌ తాగండి. అప్పుడు తెలుస్తుంది. నీటి నాణ్యత ఎలా ఉందో’అని చురకలంటించారు.

>
మరిన్ని వార్తలు