‘అలాగైతే అందరి పేర్లూ రామ్‌గా మార్చాలి’

15 Nov, 2018 13:08 IST|Sakshi
పటేల్‌ ఉద్యమ నేత హార్థిక్‌ పటేల్‌ (ఫైల్‌ఫోటో)

అహ్మదాబాద్‌ : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నగరాల పేర్లను మార్చడం పట్ల పటేల్‌ ఉద్యమ నేత హార్థిక్‌ పటేల్‌ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. యోగి ఆదిత్యానాథ్‌ సర్కార్‌ అలహాబాద్‌, ఫైజాబాద్‌ నగరాల పేర్లను మార్చడాన్ని పటేల్‌ ప్రస్తావిస్తూ పేర్లు మార్చినంత మాత్రన సమస్యలు పరిష్కారమైతే భారతీయులందరి పేర్లను రాముడిగా మార్చాలని చురకలు వేశారు.

నగరాల పేర్లను మార్చడంతో దేశం సుసంపన్నమైతే ఇక దేశంలోని 125 కోట్ల మంది భారతీయుల పేర్లను రాముడిగా మార్చాలని వ్యాఖ్యానించారు. దేశంలో నిరుద్యోగం, రైతుల సమస్యలు వంటి ఎన్నో అంశాలు ప్రధానంగా ముందుకొస్తుంటే ప్రభుత్వం మాత్రం పేర్లు, విగ్రహాల పట్ల ఆసక్తిగా ఉందని ఎద్దేవా చేశారు.

ఫైజాబాద్‌ జిల్లాను అయోధ్యగా మారుస్తున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఇటీవల ప్రకటించిన క్రమంలో హార్ధిక్‌ పటేల్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతకుముందు అలహాబాద్‌ పేరును ప్రయాగ రాజ్‌గా యూపీ ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. ఇక ముజఫర్‌నగర్‌ పేరును లక్ష్మీనగర్‌గా, గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌ను కర్ణావతిగా మార్చాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు