జాధవ్‌ కేసు: కేవలం ఒక్క రూపాయే ఛార్జ్‌

17 Jul, 2019 20:22 IST|Sakshi

 ఒక్క రూపాయి మాత్రమే ఫీజు తీసుకున్న న్యాయవాది హరీష్‌ సాల్వే

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉ‍త్కంఠగా ఎదురుచూసిన కులభూషన్‌ జాదవ్‌ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో భారత్‌ గెలుపుపై ప్రధానితో సహ దేశ వ్యాప్తంగా ప్రజలు  ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంతర్జాతీయ వేదికపై భారత్‌ గెలుపులో  ఆ కేసును వాదించిన భారత న్యాయవాది హరీష్‌ సాల్వే కృషి వర్ణించలేనిది. గూఢచర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు నిర్ధారిస్తూ 2017 ఏప్రిల్‌లో మిలటరీ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ఐసీజేని ఆశ్రయించింది. భారత పిటిషన్‌ను స్వీకరించిన అంతర్జాతీయ న్యాయస్థానం పలుమార్లు ఇరు దేశాల వాదనలను విన్నది.
అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం

భారత్‌ తరఫున వాదనలు వినిపించిన  హరీష్‌ సాల్వే.. పాక్‌ వక్రబుద్ధిని బట్టబయలు చేస్తూ.. ఐసీజే ముందు వారి కుట్రలను వివరించారు. అంతేకాదు కులభూషన్‌ జాదవ్‌ నిర్దోషి అని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో న్యాయస్థానంలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మందిని ఒప్పించగలికారు. సుధీర్ఘ కాలం పాటు సాగిన కేసు విచారణలో.. ఎట్టకేలకు భారత్‌ పైచేయి సాధించింది. పాక్‌ సైనిక కోర్టు కుల్‌భూషణ్‌ జాదవ్‌కు విధించిన మరణ శిక్షను నిలిపివేయాలని తీర్పు వెలువరించింది. అయితే సాల్వే గురించి మరో విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంది. ఈ కేసు విచారణకు ఆయన కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సుష్మాస్వరాజ్‌ ట్విట్‌లో వెల్లడించారు. దీనిపై ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రశంశలు అందుతున్నాయి. ఇప్పటికే సుష్మాస్వరాజ్‌ ట్విటర్‌ వేదికగా ఆయనపై ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు