‘ఇక అందరి చూపు కశ్మీరీ అమ్మాయిల వైపే’

10 Aug, 2019 12:25 IST|Sakshi

హరియాణా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

చండీగఢ్‌ : ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కశ్మీర్‌ లోయలో ఇప్పుడిప్పుడే ఆంక్షలు సడలిస్తున్నారు. ఇక బాధ్యత గల పదవిలో కొనసాగుతున్న వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శల పాలవతున్నారు. ‘ఇక అందమైన కశ్మీరీ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు’ అని వ్యాఖ్యానించి దుమారం రేపిన యూపీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్‌ సైనీ వ్యవహారం మరువక ముందే హరియాణా ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మహర్షి భగీరథ జయంత్యుత్సవాల్లో పాల్గొన్న సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ మాట్లాడుతూ..‘మా ప్రభుత్వంలోని కొందరు మంత్రులు బిహార్‌ నుంచి కోడళ్లను తెచ్చుకుంటామని చెప్పేవారు. ఇకపై అలాంటి పరస్థితి ఉండదు. అందరి చూపు  ఇక కశ్మీరీ అమ్మాయిల పైపే ఉంటుంది. ఆర్టికల్‌ 370 రద్దవడంతోనే ఇది సాధ్యమైంది. కశ్మీరీ అమ్మాయిల్ని కోడళ్లుగా, భార్యగా చేసుకునేందుకు అందరూ మొగ్గుచూపుతారు’అని వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలో భేటీ బచావో భేటీ పఢావో కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. ‘భేటీ బచావో భేటీ పఢావో’తో హరియాణాలో లింగ నిష్పత్తిలో వ్యత్యాసం తగ్గిందని అన్నారు. ఈ కార్యక్రమం అమలుకు ముందు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉండేవని చెప్పారు. 1000 మంది బాలలకు 850 నుంచి 933 మంది బాలికలు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు. 

మరిన్ని వార్తలు