పాఠశాలల్లో గాయత్రీ మంత్రం

26 Feb, 2018 03:45 IST|Sakshi

చండీగఢ్‌: పాఠశాలల్లో విద్యార్థులు ఉదయం ప్రార్ధనగా గాయత్రీ మంత్రం జపించాలని హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాల ప్రిన్సిపాల్స్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రామ్‌ బిలాస్‌ శర్మ తెలిపారు. దైవ ప్రార్థనల్లో గాయత్రీ మంత్రానికి సమున్నత స్థానం ఉందనీ, అందుకే ప్రార్ధనా గీతంగా మార్చామని తెలిపారు.

తాము అధికారంలోకి వచ్చాక గీతా శ్లోకాలను పాఠ్యాంశాలుగా చేశామనీ, ఇది సానుకూల ఫలితాలను ఇచ్చిందనీ వివరించారు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమైందో సంస్కృతీ విలువలు కూడా అంతే ముఖ్యమని, విద్యార్థులను సన్మార్గంలో నడిపేందుకు గాయత్రీ మంత్రాన్ని ప్రార్ధనా గీతంగా చేశామని ముఖ్యమంత్రి ఖట్టర్‌ అన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం వచ్చే మంగళవారం ఆదేశాలు జారీ చేయనుంది.

మరిన్ని వార్తలు