ఎంపీలు వస్తే అధికారులు లేచి నిలబడాలి..

19 Jun, 2018 14:27 IST|Sakshi
హరియాణ ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, చండీగఢ్‌ : హరియాణలో బీజేపీ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‌ సభ్యులు సందర్శిస్తే అధికారులు లేచి నిలబడాలని సూచించింది. ఎంపీల పర్యటనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అధికారులు తమను ఖాతరు చేయడం లేదని ఎంపీలు హరియాణ సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌కు ఫిర్యాదు చేయడంతో 2011 మార్గదర్శకాలను ఉటంకిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా కార్యాలయాల్లోకి పార్లమెంట్‌ సభ్యులు ప్రవేశించగానే సంబంధిత అధికారులు అప్రమత్తమై లేచి నిలబడి,వారిని స్వాగతించాలని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

హరియాణ మంత్రి అనిల్‌ విజ్‌ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసిందని నిర్ధారించారు. మరోవైపు ఈ ఉత్తర్వులపై అధికారులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వ అధికారుల హోదాను దిగజార్చడంతో పాటు వారి స్థాయిని తగ్గిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్‌ అధికారులు ఇలా సమయాన్ని వృధా చేయడం సరికాదని, ఈ పనులు దిగువస్థాయి సిబ్బందికి అప్పగిస్తే బాగుండేదని మరికొందరు సీనియర్‌ అధికారులు వాపోయారు. 

మరిన్ని వార్తలు